తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల కాలంలో(12వ శతాబ్దంలో) చిన్న చిన్న నదులకు ఆనకట్టలు నిర్మించి నీటి పారుదల సౌకర్యాలను కల్పించారు. రామప్పా, పాకాల, లక్నవరం లాంటి ప్రసిద్ధమైన చెరువులు ఈ కాలంలోనే నిర్మితమయ్యాయి. నిజాం పాలకుల కాలంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ లాంటి అనేక నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించారు.
|
నేరుగా వర్షపాతం ద్వారా కాకుండా ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా పంటలకు నీటిని సరఫరా చేయడాన్ని ‘నీటి పారుదల’ అంటారు. నీటి పారుదల ఎల్లప్పుడూ వర్షపాతం, స్థలాకృతి, పరీవాహక ప్రదేశం, నేల స్వభావం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
స్వాతంత్య్రానంతరం రాష్ట్రంలో అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించారు. వీటి ద్వారా తాగు, సాగు నీటిని అందిస్తున్నారు. నీటి పారుదల సౌకర్యాల కల్పనతో పాటు తాగు నీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం, పర్యాటక రంగం అభివృద్ధి లాంటి బహుళ ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ‘బహుళార్థ సాధక ప్రాజెక్టులు’ అంటారు. వ్యవసాయ రంగంలో సాగునీరు అత్యంత కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి కోసం 2014-15 రాష్ట్ర బడ్జెట్లో రూ.8,492.75 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల సౌకర్యాలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) కాలువలు 2) బావులు 3) చెరువులు 4) ఇతర ఆధారాలు రాష్ట్రంలో స్థూల సాగు భూమి 31.64 లక్షల హెక్టార్లు. ఇందులో బావుల ద్వారా 23.36 లక్షల హెక్టార్లు (73.83 శాతం), కాలువల ద్వారా 4.7 లక్షల హెక్టార్లు (14.85 శాతం), చెరువుల ద్వారా 2.83 లక్షల హెక్టార్లు (8.94 శాతం) సాగవుతోంది.
కాలువలు: నీటి పారుదల సౌకర్యాల్లో కాలువలు అతి ముఖ్యమైనవి. వీటి నిర్వహణ, నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్నప్పటికీ ఇవి ఎక్కువ విస్తీర్ణంలో భూమికి సాగు నీటిని అందిస్తాయి. కాలువల కింద సేద్యపు భూమి విస్తీర్ణం 1960-61లో 19 శాతం ఉండగా, 2013-14 నాటికి ఇది 14.85 శాతానికి తగ్గింది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సాగు నీటి అవసరాల ప్రాధాన్యాన్ని గుర్తించి నదులు, చెరువుల ద్వారా లభించే నీటి వనరులను రాష్ట్ర అభివృద్ధికి విస్తృతంగా వినియోగించడానికి కృషి చేస్తోంది. రాష్ట్రంలో 933.70 టీఎంసీల గోదావరి జలాలు, వరద నీటితో కలిపి కృష్ణా నది జలాల్లో 293 టీఎంసీల నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించడానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనలో ఉన్న భారీ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తోంది.
బావులు: రాష్ట్రంలో మిగిలిన అన్ని రకాల నీటి పారుదల సౌకర్యాల కంటే బావుల ద్వారా లభించే నీటి పారుదల సదుపాయాలు అధికంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు అధికంగా ఉండటం, నదులు ప్రవహించడం వల్ల భూమి ఎక్కువ చదునుగా ఉండటం. అందువల్ల బావుల ద్వారా సేద్యం పెరిగి చెరువుల ప్రాధాన్యం తగ్గింది.
బావులను సాధారణ బావులు, గొట్టం బావులు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1960-61లో బావుల ద్వారా 19.01 శాతం నీటి పారుదల సదుపాయాలు అందుబాటులో ఉండగా, 2013-14 నాటికి ఇది 73.83 శాతానికి పెరిగింది.
చెరువులు: చెరువుల కింద సేద్యం అయ్యే భూ విస్తీర్ణం 1960-61లో 60 శాతం ఉండగా, 2013-14 నాటికి 8.94 శాతానికి తగ్గింది. దీనికి కారణం అనేక ఏళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల పూడిక పెరిగిపోయి చాలా చెరువులు నిరుపయోగంగా మారాయి.
సాధారణంగా చెరువులు రెండు రకాలు. అవి..
1) సహజంగా ఏర్పడే చెరువులు
2) మానవ నిర్మిత చెరువులు
వ్యవసాయాన్ని పునరుత్తేజం చేయడానికి దీర్ఘకాలిక చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఆశయం ‘మన ఊరు-మన చెరువు’.
మిషన్ కాకతీయ: చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్లో ప్రారంభించారు. రాష్ట్రంలోని చెరువులను ఏటా 20 శాతం చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో సుమారు 46,531 చెరువులు ఉన్నట్లు గుర్తించి, వాటిని రానున్న 5 ఏళ్లలో దశలవారీగా పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కోసం అయిదేళ్లకుగాను రూ.22,500 కోట్లు వెచ్చించనుంది. దీని ద్వారా దాదాపు 265 టీఎంసీల నీటిని నిల్వ చేసి, 25 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి మొదటి దశలో రూ.1783 కోట్లను కేటాయించి, సుమారు 9577 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తెలంగాణలో వేలాది చెరువులను తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి గుర్తుగా మిషన్ కాకతీయ పైలాన్ను వరంగల్లో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ రాజధానిగా కాకతీయులు పాలన సాగించడంతో పాటు ఎక్కువ చెరువులు ఇక్కడే ఉండటం వల్ల పైలాన్ను ఈ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు
మిషన్ కాకతీయ పథకానికి నాబార్డు రూ. 300 కోట్లు మంజూరు చేసింది. మిషన్ కాకతీయ పరిశోధనకుగాను అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ 50 వేల డాలర్లను మంజూరు చేసింది.
తెలంగాణ జిల్లాల్లో ప్రవహిస్తున్న నదులుఆదిలాబాద్: గోదావరి, పెన్ గంగా, వార్ధా, ప్రాణహిత, కడెం, ఎర్రవాగు, పెద్దవాగు, సిద, సుద్దవాగు, రాలివాగు, వట్టివాగు. కరీంనగర్: గోదావరి, మానేరు,బొగ్గులవాగు. వరంగల్: గోదావరి, ఆలేరు, మున్నేరు, పాలేరు, కిన్నెరసాని, సలివాగు, వైరా, సంపెన్నవాగు. ఖమ్మం: మున్నేరు, గోదావరి, కిన్నెరసాని, వైరా నది, శబరి, పాలేరు, ఆలేరు, ముక్కమామిడి వాగు, కొట్టలేరు, గుండ్లవాగు, మోడికుంటవాగు. నల్గొండ: కృష్ణా, మూసీ, ఆలేరు, పాలేరు, పెద్దవాగు, దిండి, హాలియ. నిజామాబాద్: గోదావరి, మంజీరా, పులాంగు, ఆలేరు, కల్యాణి, యడ్లకట్ట. మెదక్: మంజీరా, కుట్లేరు, వాల్ధీ. మహబూబ్నగర్: కృష్ణా, తుంగభద్ర, దిండి, పెదవాగు, చినవాగు. రంగారెడ్డి: మూసీ, జూట్పల్లివాగు, పర్గి వాగు, కోటిపల్లి, ఈసి. హైదరాబాద్: మూసీ నది. |
0 comments:
Post a Comment